

తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ మాటల యుద్ధం ముదురుతోంది. సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదని ఆయన ఆరోపించారు. “మూడు నెలల్లో పిల్లలు పుట్టరు అన్న విషయం అందరికీ తెలిసిందే” అంటూ సీఎం వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందించారు. రాష్ట్రంలో దోచుకో, దాచుకో రాజకీయాలు జరుగుతున్నాయని, సీఎం కుటుంబమే దోపిడీకి పాల్పడుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక పార్టీ విషయానికి వస్తే, టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడంపై గతంలో చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ గుర్తు చేశారు.
ప్రజలు టీఆర్ఎస్గానే ఉండాలని భావించినా, పార్టీ నిర్ణయం అధినేతదేనని స్పష్టం చేశారు. అలాగే వచ్చే ఎన్నికల్లో బీజేపీతో ఎలాంటి పొత్తులు ఉండబోవని క్లారిటీ ఇచ్చారు. ప్రజాసమస్యలపై పోరాటం కొనసాగిస్తామని, 2027లో పాదయాత్ర చేపడతానని ప్రకటించారు. రాష్ట్రంలో అధికార పార్టీ, ప్రతిపక్షాలపై అసంతృప్తి పెరుగుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శిస్తూ, భవిష్యత్తులో ప్రజలతో నేరుగా మమేకమై ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!