

మక్తల్లో బీజేపీ ఆరో వార్డు అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్య ఘటనపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి తీవ్రంగా స్పందించారు. మహాదేవప్ప ఆత్మహత్య అత్యంత బాధాకరమని పేర్కొంటూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ విషయంలో బీజేపీ నేతలు మాట్లాడుతున్న తీరు అమానవీయంగా ఉందని, ఒక వ్యక్తి మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం అనైతికమని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో లాభపడాలనే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమని విమర్శించారు.
తాను ఎప్పుడూ ఘర్షణ, ఫ్యాక్షన్ రాజకీయాలకు వ్యతిరేకమని, ఆరోగ్యకరమైన రాజకీయాలనే కోరుకునే వ్యక్తినని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. సర్పంచ్గా, జడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా అంచెలంచెలుగా ఎదిగానని, తన రాజకీయ జీవితంలో ఎవరికి హాని తలపెట్టలేదన్నారు. మహాదేవప్ప ఆత్మహత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని, సంబంధం ఉందని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ చేపడుతుందని, మీడియా వాస్తవాలను ప్రజల ముందుంచాలని ఆయన కోరారు.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!