

రాఘవ్ చద్దా వ్యవహారం ఆమ్ ఆద్మీ పార్టీ లో అంతర్గత విభేదాలను బయటపెట్టింది. ఇటీవల ఆయనను రాజ్యసభలో ఉపనేత పదవి నుంచి తొలగించడంతో పార్టీ నాయకులు ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. ఆతిషి ఆయన భారతీయ జనతా పార్టీ లో చేరేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించగా, సౌరభ్ భరద్వాజ్ ఆయన బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదని అన్నారు.
ఈ ఆరోపణలకు రాఘవ్ చద్దా ఘాటుగా స్పందిస్తూ “నేను గాయపడ్డాను కానీ బలహీనుడిని కాదు” అని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో ఆయన మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలు అన్నీ అబద్ధాలని, తనపై కుట్ర జరుగుతోందని అన్నారు. ఒక అబద్ధాన్ని పదేపదే చెబితే నిజమని నమ్మే పరిస్థితి వస్తుందని, అందుకే ఇప్పుడు స్పందిస్తున్నానని చెప్పారు.
పార్లమెంట్ లో ప్రతిపక్షాలు వాకౌట్ చేసినప్పుడు తాను కూడా వారితోనే ఉన్నానని, వాకౌట్ చేయలేదన్న ఆరోపణలు తప్పని చెప్పారు. ఒక ముఖ్యమైన తీర్మానంపై సంతకం చేయలేదన్న ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. తాను ఎప్పుడూ ప్రజల సమస్యలను ప్రస్తావించేందుకు సభకు వెళ్తానని, అనవసర వివాదాలకు కాదు అని స్పష్టం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!