

ప్రపంచ ప్రసిద్ధ మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా తనపై కావాలనే తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. మేడారంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మనసా–వాచా–కర్మణా చిత్తశుద్ధితో ఆదివాసీల అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం పోరాడే ఆదివాసి బిడ్డను తానని స్పష్టం చేశారు. తాను పారిపోయే వ్యక్తి కాదని, భక్తులు మరియు ప్రజల కోసం పంతం నెగ్గించుకునే రకమని ధీమా వ్యక్తం చేశారు. మేడారం జాతర విజయాన్ని జీర్ణించుకోలేక కొందరు కుట్రలు చేస్తున్నారని, వాటికి తాను భయపడబోనని మంత్రి తెలిపారు.
జాతరను విజయవంతంగా నిర్వహించినట్లే అనంతర పనులన్నింటినీ సమర్థంగా పూర్తి చేస్తున్నామని ఆమె చెప్పారు. ఐదువేల మందికి పైగా పారిశుద్ధ్య సిబ్బందిని నియమించి పరిసరాలను పూర్తిగా పరిశుభ్రం చేస్తున్నామని, రేయింబవళ్లు సేవలందించిన పోలీసు సిబ్బందికి అభినందనలు తెలిపారు. వీఐపీ రాకపోకల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడినప్పటికీ ఘట్టమ్మ ఆలయం వద్ద ప్రత్యేక చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. శాశ్వత ఆలయ నిర్మాణం పూర్తవడంతో ఒక్క రోజులోనే ఎనిమిది లక్షల మంది భక్తులు తరలివచ్చారని తెలిపారు. కోట్లాది మంది భక్తులు వచ్చినా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించామని, వచ్చే జాతరలో ట్రాఫిక్ సమస్య పూర్తిగా లేకుండా మరింత పటిష్ట చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!