

హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం క్యూర్ పరిధిలోని ట్రై మున్సిపల్ కార్పొరేషన్ల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా నగరంలో ప్రతిరోజూ ఇంటింటికి చెత్త సేకరణ తప్పనిసరిగా జరగాలని సీఎం స్పష్టం చేశారు. చెత్త సేకరణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి వాహనానికి ప్రత్యేక ప్రాంతాన్ని కేటాయించి పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులకు తెలిపారు.
నగర విస్తరణను దృష్టిలో ఉంచుకుని కొత్తగా గుర్తించిన డంప్ యార్డులను త్వరగా సిద్ధం చేసి వినియోగంలోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. నిర్మాణ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలని, వాటి తరలింపుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు.
అదేవిధంగా నగరంలో అపరిశుభ్రత లేకుండా చూసుకోవడంతో పాటు దోమల నివారణ చర్యలు చేపట్టాలని, సీజనల్ వ్యాధుల సమయంలో నగరవాసులకు సరైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!