

వికారాబాద్ జిల్లా అనంతగిరి హరితా రిసార్ట్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల కోసం శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,మంత్రులు శ్రీధర్ బాబు,పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల హాజరయ్యారు. ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్ర్యానికి ముందు ఆవిర్భవించి స్వాతంత్ర్యం తీసుకువచ్చిందని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్రలు జరుగుతున్న సమయంలో ఈ శిక్షణా కార్యక్రమం ఎంతో ముఖ్యమన్నారు. డీసీసీ అధ్యక్షులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, జిల్లాలకు అధిపతులమని భావించకుండా అందరితో కలిసి పనిచేయాలని సూచించారు. వ్యతిరేకించిన వారిని అణగదొక్కే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.
గాంధీ కుటుంబం దేశం కోసం చేసిన త్యాగాలను ప్రస్తావిస్తూ, మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ సేవలను గుర్తు చేశారు. సోనియా గాంధీ పార్టీ కోసం చేసిన త్యాగాన్ని, రాహుల్ గాంధీ పాదయాత్రను ప్రశంసించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర, సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ విజయాల్లో ప్రస్తావించాలన్నారు. వైఎస్ షర్మిల తెలంగాణలో 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి, ఏపీలో పార్టీ కోసం కష్టపడుతున్నారని తెలిపారు.
కలిసికట్టుగా పనిచేసినందువల్లే తక్కువ ఓట్ల నుంచి కాంగ్రెస్ 40 శాతం ఓట్లు సాధించి అధికారంలోకి వచ్చిందన్నారు. 119 నియోజకవర్గాల్లో 42 లక్షల డిజిటల్ సభ్యత్వాలు నమోదు చేశామని చెప్పారు. బాగా పని చేసిన డీసీసీ అధ్యక్షులకు ఎమ్మెల్యే అవకాశాలు, అనుబంధ విభాగాల్లో పని చేసిన వారికి కార్పొరేషన్ పదవులు ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్లో కోటాలు లేవని, మెరిట్కే ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. పదవులను దుర్వినియోగం చేయవద్దని, పార్టీ విశ్వాసాన్ని దెబ్బతీయవద్దని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రత్యర్థి పార్టీలతో 2 శాతం తేడా ఉండగా, పార్లమెంట్ ఎన్నికల్లో అది 4 శాతానికి, మున్సిపల్ ఎన్నికల్లో 12 శాతానికి పెరిగిందన్నారు. బీసీలు, ఓబీసీలకు కాంగ్రెస్ వల్లే మంచి ప్రాతినిధ్యం లభించిందని చెప్పారు. 100 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో కులగణన నిర్వహించి, ఎస్సీ వర్గీకరణ అమలు చేశామని తెలిపారు. పైరవీలు చేయకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని సూచించారు. తాను 16 ఏళ్లలో జడ్పీటీసీ నుంచి సీఎం వరకు ఎదిగానని, కాంగ్రెస్ ఇచ్చిన అవకాశమిదేనన్నారు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలపడాలని, కలిసి ఎదగాలని పిలుపునిచ్చారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!