

రాష్ట్రంలో జరుగుతున్న వర్షాల దెబ్బకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు ఖమ్మం, మహబూబాబాద్, హుస్నాబాద్ వంటి పలు జిల్లాల్లో పంటలను తుడిచిపెట్టేశాయి. వరి పొలాలు నీటమునిగిపోగా, మార్కెట్ యార్డుల వద్ద నిల్వ ఉంచిన ధాన్య రాశులు కూడా నీటిలో కలిసిపోయాయి. రైతుల కష్టం కళ్లముందే నీటిలో కొట్టుకుపోవడం హృదయవిదారక దృశ్యాలుగా మారింది. కొంతమంది రైతులు తాము కొట్టుకుపోయిన ధాన్యాన్ని రక్షించుకునేందుకు చేతులతోనే సంచుల్లో నింపుతుండగా, ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రభుత్వ సహాయం కోరుతూ వారు చేస్తున్న ఆర్తనాదాలు అందరినీ కదిలిస్తున్నాయి.
హుస్నాబాద్లో జరిగిన ఘటన మరింత కలచివేసింది — ఓ మహిళా రైతు కలెక్టర్ను చూసి కన్నీరు మునిగింది. “ఈ ధాన్యం అమ్మితే నా కూతురి పెళ్లి చేసుకోవాలని అనుకున్నా, ఇప్పుడు అంతా నీటిలో పోయింది… మాకు ఎవరు న్యాయం చేస్తారు?” అంటూ ఆమె కలెక్టర్ పాదాలపై పడ్డారు. ఆమెను సాంత్వన పరచడం అధికారులకు కూడా కష్టంగా మారింది. ఈ దృశ్యాలు పార్టీ నాయకులు, కార్యకర్తలను ఆందోళనకు గురిచేశాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరింత దయనీయంగా ఉందని వారు చెబుతున్నారు. “ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రైతుల మధ్యకు వెళ్లి వారికి భరోసా ఇవ్వాలి. కేవలం కార్యాలయంలో కూర్చుని ఆదేశాలు ఇవ్వడం సరిపోదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి బాధను వినాలి,” అని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి.
విపక్షాలు ఈ సమస్యపై రాజకీయంగా లాభపడకముందే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.










కామెంట్స్ (2)
Heartbreaking to see what farmers are going through
Prayers for farmers