

‘పార్టీలో నాయకుడిగా ఎదగాలంటే క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్త కష్టాన్ని గుర్తించాలి. ఉద్యమి, సాధక్, ప్రదాతగా పని చేస్తేనే సంపూర్ణ నాయకత్వం సాధ్యమవుతుంది’ అని డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి సభ్యత్వాన్ని స్వయంగా తీసుకుని, కార్యకర్తల బీమా కోసం రూ.2 కోట్ల చెక్కును పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి మనోహర్కు అందజేశారు. ఐదో విడత సభ్యత్వ నమోదు ఈ నెల 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమవుతుందని, పిఠాపురంలో వారం ముందే మొదలవుతుందని తెలిపారు.
జనసేనకు వందలాది మంది కాకుండా లక్షల మందిని ప్రభావితం చేసే నాయకత్వం అవసరమని పవన్ పేర్కొన్నారు. పార్టీ భావజాలం బలమైనదని, అందుకే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఆహ్వానాలు వస్తున్నాయని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడే వారికే ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. ఉద్యమిగా సభ్యత్వం తీసుకుని పని చేసే వారిని ‘ఉద్యమి’, సభ్యత్వం పెంచే వారిని ‘సాధక్’, పార్టీకి ఆర్థిక, సాంకేతిక, మేధో సహాయం చేసే వారిని ‘ప్రదాత’గా పిలుస్తామని వివరించారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తాను ప్రచారం చేయకపోయినా రెండు స్థానాల్లో గెలుపు సాధించామని, అది మార్పుకు సంకేతమని అన్నారు. జనసేన ఒక ప్రాంతానికి పరిమితం కాదని, యువశక్తే పార్టీకి ప్రధాన బలం అని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!