

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణా పై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో కీలక పరిణామంగా భారత్కు రష్యా చమురు దిగుమతుల విషయంలో అమెరికా తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. భారతీయ శుద్ధి కర్మాగారాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు తాత్కాలికంగా 30 రోజుల వరకు మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. ఈ చర్యతో ప్రపంచ మార్కెట్లో చమురు సరఫరా కొనసాగేందుకు సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.
అయితే ఇప్పటికే సముద్రంలో నిలిచిపోయిన రష్యా నౌకల నుంచి మాత్రమే ఈ చమురు కొనుగోళ్లు జరగాలని స్పష్టం చేశారు. దీని వల్ల రష్యాకు ఆర్థికంగా పెద్దగా లాభం ఉండదని చెప్పారు. అలాగే అమెరికాకు భారత్ ముఖ్యమైన భాగస్వామి అని ఆయన వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో భారత్ అమెరికా నుంచి ముడి చమురు కొనుగోళ్లను మరింత పెంచుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
2022 నుంచి భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులను గణనీయంగా పెంచింది. అయితే ఆంక్షలు మరియు అమెరికాతో జరుగుతున్న మధ్యంతర వాణిజ్య చర్చల కారణంగా ఇటీవల ఈ దిగుమతులు కొంత తగ్గాయి. ఇదే సమయంలో అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్తో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.
దీంతో అంతర్జాతీయ చమురు రవాణా పై ప్రభావం పడుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్కు సుమారు 83 డాలర్ల వద్ద కొనసాగుతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!