

తెలుగు రాష్ట్రాలు అంతటా కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తి పరవశంతో సాగాయి. “ఓం నమఃశివాయ” నినాదాలతో ఆలయాలు మారుమోగాయి. భక్తులు తెల్లవారుజాము నుంచే శివాలయాలకు తరలి వచ్చి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపారాధనలు నిర్వహించారు. ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించడం, అరటి ఆకులలో దీపాలు పెట్టి నదుల్లో వదిలేయడం భక్తి భావాన్ని మరింత పెంచాయి. చాలామంది దానధర్మాలు, పుణ్యస్నానాలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.
శ్రీశైలంలో, మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారి దర్శనార్థం భక్తులు వేల సంఖ్యలో తరలి వచ్చారు. పాతాళగంగలో పుణ్యస్నానం చేసి, ఆలయ దర్శనానికి గంటల తరబడి క్యూలైన్లలో నిలబడ్డారు. సాధారణ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పట్టింది .
వరంగల్ జిల్లాలోని వేయిస్తంభాల దేవాలయం, కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం, రామప్ప, కురవి వీరభద్రస్వామి, పాలకుర్తి సోమేశ్వర ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. దీపాల వెలుగులో శివాలయాలు సాక్షాత్ కైలాసంగా మెరిసిపోయాయి.
నల్గొండ , మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కూడా భక్తులు కార్తీక దీపాలు వెలిగించి, స్వామివారి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. బొంతపల్లి వీరభద్ర స్వామి, ఝారాసంగం కేతకి సంగమేశ్వర, సోమేశ్వర ఆలయాలు భక్తులతో నిండిపోయాయి.
భద్రాచలంలో గోదావరి తీరాలు దీపాల వెలుగుతో తళతళలాడాయి. వేలాది మంది భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు చేసి, కార్తీక దీపాలు వదిలి, శ్రీరామచంద్ర స్వామికి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా నగరం అంతా భక్తి కాంతులతో కాంతిమయం అయింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!