

తెలంగాణలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఇటీవల విధి నిర్వహణలో మరణించిన తెలంగాణ ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కుటుంబానికి, అలాగే గత సంవత్సరం అక్టోబర్లో డ్యూటీలో ఉండగా దుండగుల కత్తి దాడిలో మృతిచెందిన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబానికి చెరో రూ. కోటి ఎక్స్గ్రేషియా సహాయం ప్రకటించింది. ఈ సహాయానికి సంబంధించిన చెక్కులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిజామాబాద్లో ఆయా కుటుంబాలకు స్వయంగా అందజేశారు.
ఈ నెల 23 న నిజామాబాద్లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకునే ప్రయత్నంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధి నిర్వహణలో పాల్గొన్న కానిస్టేబుల్ సౌమ్యను అక్రమ రవాణాదారులు వాహనంతో ఢీకొట్టారు. తీవ్ర గాయాలపాలైన ఆమె హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతూ మృతిచెందారు. అలాగే విధి నిర్వహణలో దాడికి గురై మరణించిన కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆర్థిక సాయం, పోలీసు సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందనే నమ్మకాన్ని మరింత బలపరుస్తుందని సీఎం తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!