

నటుడు బ్రహ్మాజీ దర్శకుడు కృష్ణవంశీతో తనకున్న ప్రత్యేకమైన అనుబంధం గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కృష్ణవంశీని మహానుభావుడిగా అభివర్ణించిన బ్రహ్మాజీ.. ఆయన పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని చెప్పారు. నిన్నే పెళ్లాడతా సమయంలోనే కృష్ణవంశీని తొలిసారి చూశానని, అప్పటి నుంచే ఆయనతో కలిసి పనిచేయాలని బలంగా కోరుకున్నానని తెలిపారు. నటుడిగా స్థిరపడకముందు అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో కృష్ణవంశీ రూమ్మేట్స్ ద్వారా ఆయనకు పరిచయం ఏర్పడిందని చెప్పారు. కృష్ణవంశీ రూమ్లో ఉన్నారని తెలిస్తే తాను అక్కడికి వెళ్లేందుకు కూడా భయపడేవాడినని, అందుకు కారణం ఆయన పట్ల ఉన్న గౌరవమేనని వివరించారు.
సింధూరం కోసం తొలిసారి కృష్ణవంశీ నుంచి పిలుపు వచ్చినా.. ఆ తర్వాత ఆ అవకాశాన్ని రద్దు చేయడంతో చాలా బాధపడ్డానని బ్రహ్మాజీ గుర్తుచేసుకున్నారు. అయితే కొంతకాలం తర్వాత మురారి సినిమాలో అవకాశం ఇచ్చారని, అప్పటి నుంచి తమ మధ్య మంచి స్నేహం, బాండింగ్ ఏర్పడిందని తెలిపారు. సెట్స్లో తాము ఎక్కువగా మాట్లాడుకోమని, ఎవరి పనిలో వారు ఉంటూనే పరస్పర గౌరవాన్ని కొనసాగిస్తామని చెప్పారు. కృష్ణవంశీ తన ప్రతి సినిమాలో దాదాపుగా తన కోసం ఓ పాత్ర రాస్తారని బ్రహ్మాజీ వెల్లడించారు. ఆయనతో కలిసి ఎన్నో సినిమాలు చేశానని, ఇటీవల రంగమార్తాండలోనూ పనిచేశానని తెలిపారు. తాను ఎక్కువ టేక్లు తీసుకోకుండా ఒక్క టేక్లోనే సన్నివేశాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తానని, కృష్ణవంశీ కూడా ఎక్కువ టేక్లను ఇష్టపడరని చెప్పారు. తమ మధ్య ఉన్న ఈ అవగాహనే స్నేహానికి, వృత్తిపరమైన అనుబంధానికి మరో కారణమని బ్రహ్మాజీ పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!