

ఇటీవల విడుదలై ప్రశంసలు అందుకుంటున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’పై బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో చర్చకు దారితీశాయి. సినిమా బాగుందని చెబుతూనే, అందులోని కొన్ని రాజకీయ అంశాలను తాను సమర్థించలేనని హృతిక్ పేర్కొనడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు ఆదిత్య ధర్ స్పందించారు. సినిమా నచ్చిందని చెప్పినందుకు హృతిక్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ చిత్రంతో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని హృతిక్ పేర్కొన్నప్పటికీ, రాజకీయ కోణాలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. విమర్శలు పెరగడంతో ఆయన మరోసారి సోషల్ మీడియాలో స్పందిస్తూ ‘ధురంధర్’ తన మనసును తాకిందని, ఆదిత్య ధర్ అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసలు కురిపించారు. దీనికి స్పందించిన దర్శకుడు, చిత్ర బృందం చేసిన కష్టాన్ని గుర్తు చేస్తూ హృతిక్కు ధన్యవాదాలు తెలిపారు.
‘‘ఈ సినిమాపై మీరు చూపిన ప్రేమ మాకు ఎంతో ప్రోత్సాహం. ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరూ వందశాతం కష్టపడ్డారు. వారి కృషికి మీ ప్రశంసలు న్యాయం చేస్తాయి. ‘ధురంధర్’కు పార్ట్ 2 ఖచ్చితంగా ఉంటుంది. సీక్వెల్ రూపొందించేటప్పుడు వచ్చిన సూచనలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటాం’’ అని ఆదిత్య ధర్ వెల్లడించారు.
రణ్వీర్ సింగ్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటికే రూ.230 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాకు పార్ట్ 2 ఖరారవడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గ్రాండ్గా సక్సెస్ మీట్ను కూడా నిర్వహించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!