

దీనస్థితిలో ఉన్న హాస్య నటి వాసుకి (పాకీజా) ప్రస్తుతం వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంకలోని శ్రీరామ వృద్ధాశ్రమంలో ఆమె ఉంటున్నారు. తమిళనాడుకు చెందిన వాసుకి 1991లో మోహన్బాబు నటించిన ‘అసెంబ్లీ రౌడీ’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు.
తరువాత ‘మేజర్ చంద్రకాంత్’, ‘పెదరాయుడు’, ‘రౌడీగారి పెళ్లాం’, ‘బ్రహ్మ’, ‘పుణ్యభూమి నాదేశం’ వంటి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల గుర్తింపు పొందారు. అయితే కాలక్రమంలో చోటుచేసుకున్న పరిణామాల వల్ల ఆమె అనేక కష్టాలు ఎదుర్కొని దుర్భర జీవితం గడిపిన విషయం ఇటీవల సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసిన శ్రీరామ వృద్ధాశ్రమం నిర్వాహకుడు జల్లి కేశవరావు ఆమెకు ఆశ్రయం కల్పించారు.
వాసుకి మాట్లాడుతూ, “నన్ను సినిమాలకు పరిచయం చేసిన మోహన్బాబు కుటుంబానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆయన తనయుడు మంచు విష్ణు నా పరిస్థితి తెలుసుకుని నా కళ్లకు శస్త్రచికిత్స చేయించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, అలాగే చిరంజీవి, నాగబాబు రూ.4 లక్షల ఆర్థిక సహాయం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ కూడా నాకు సహకరిస్తున్నారు. ఆధార్ కార్డులో చిరునామా మార్పునకు కేశవరావు సహాయం చేశారు. జిల్లా కలెక్టర్ పింఛన్తో పాటు బియ్యం కార్డు మంజూరు చేస్తే నాకు మరింత ఊరట కలుగుతుంది” అని తెలిపారు.
అలాగే, “ఆశ్రమానికి వచ్చినప్పుడు నా ఆరోగ్యం బాగా లేదు. ఇప్పుడు కొంత మెరుగైంది. ఇక్కడ ఉంటున్న వృద్ధులకు నా వంతు సేవ చేస్తున్నాను. తెలుగు ప్రేక్షకుల ప్రేమ, ఆదరణ ఎప్పటికీ మరిచిపోలేనివి” అని వాసుకి భావోద్వేగంగా చెప్పారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!