

ఆధునిక సదుపాయాలు మనిషికి భౌతిక సౌకర్యాలను అందిస్తున్నప్పటికీ, మనశ్శాంతిని మాత్రం ఇవ్వలేకపోతున్నాయి. ఒకప్పుడు సమస్యలు వచ్చినప్పుడు వాటిని పంచుకునే సన్నిహితులు ఉండేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో మునిగిపోయిన జీవనశైలి కారణంగా పక్కనున్న వారితో కూడా మాట్లాడటం తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో మనిషి క్రమంగా ఒంటరితనంలోకి జారుకుంటున్నాడు. తన సమస్యలను ఎవరికీ చెప్పుకోలేక, లోపలి బాధ బయటపడితే అపహాస్యం అవుతాననే భయంతో మౌనంగా బాధపడుతూ డిప్రెషన్లోకి వెళ్తున్నాడు. ఈ స్థితి మరింత తీవ్రమై, చివరకు ప్రాణాలు తీసుకోవడమే పరిష్కారం అన్న భావనకు దారితీసే ప్రమాదం ఉంది.
చాలామంది డిప్రెషన్ను తాత్కాలిక మూడ్ ఆఫ్గా తీసుకుంటారు. అయితే మానసిక వైద్య నిపుణుల ప్రకారం ఇది తీవ్రమైన మానసిక వ్యాధి. మెదడులో రసాయన అసమతుల్యత కారణంగా ఉత్సాహం, శక్తి, ఆనందం క్రమంగా తగ్గిపోతాయి. ఏ విషయంపైనా ఆసక్తి లేకపోవడం, ఎప్పుడూ విచారంగా ఉండటం, భవిష్యత్తుపై ఆశ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. డిప్రెషన్లో ఉన్న వ్యక్తులు బయటకు సాధారణంగా కనిపించినప్పటికీ లోపల తీవ్రంగా పోరాడుతూ ఉంటారు. వారి ప్రవర్తనలో, బాడీ లాంగ్వేజ్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి.
లైంగిక వేధింపులు, ఆర్థిక ఇబ్బందులు, ఆత్మీయులను కోల్పోవడం లేదా దీర్ఘకాలిక అనారోగ్యం వంటి కారణాలు డిప్రెషన్కు దారితీస్తాయి. గణాంకాల ప్రకారం దేశంలో జరిగే ఆత్మహత్యలలో 60 నుంచి 65 శాతం వరకు డిప్రెషన్ కారణంగానే జరుగుతున్నాయి. ఈ పరిస్థితిని ముందుగానే గుర్తిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు. మానసిక వైద్యులను సంప్రదించి కౌన్సిలింగ్ తీసుకోవడం, ఇలాంటి వారిని ఒంటరిగా వదిలిపెట్టకుండా వారితో మాట్లాడటం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం అవసరం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సానుకూల సంబంధాలు పెంచుకోవడం ఉపయోగకరం. మద్యం సమస్యను మరింత తీవ్రం చేస్తుందని గుర్తించాలి. ముఖ్యంగా, ఆపదలో ఉన్న వారిని గేలి చేయకుండా అర్థం చేసుకుని అండగా నిలబడాలి. డిప్రెషన్ చికిత్సతో నయమయ్యే వ్యాధి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!