

మధుమేహం ఉన్నవారు ఉదయం తీసుకునే అల్పాహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను ఎంచుకోవడం మంచిదని చెబుతున్నారు. రాగులతో పాటు మెంతులను అల్పాహారంలో చేర్చుకోవడం ద్వారా షుగర్ నియంత్రణకు సహాయపడవచ్చని సూచిస్తున్నారు. రాగుల్లో ఉండే డైటరీ ఫైబర్, పాలీఫెనాల్స్ జీర్ణక్రియను నెమ్మదింపజేసి గ్లూకోజ్ను క్రమంగా విడుదల చేయడంలో సహాయపడతాయి. దీంతో రోజంతా శక్తి స్థిరంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
మెంతుల్లో ఉండే సహజ పీచు పదార్థాలు చక్కెర శోషణను తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు పేర్కొంటున్నారు. రాగి పిండితో తయారు చేసే జావ లేదా అంబలిలో వేయించిన మెంతి పొడిని కలిపి తీసుకోవచ్చని, అలాగే రాగి దోశలు లేదా ఇడ్లీ పిండిలో మెంతులను చేర్చుకోవచ్చని సూచిస్తున్నారు. ఈ కలయిక మధుమేహ నియంత్రణతో పాటు కొలెస్ట్రాల్ తగ్గింపు, బరువు నిర్వహణ, ఎముకల ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అయితే మందులు లేదా ఇన్సులిన్ తీసుకునే వారు వైద్యుల సలహాతో ఆహార మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!