

హైదరాబాద్లోని చారిత్రక తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో అమెరికా రాయబారి సెర్జియో గోర్, అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి వ్యాపార సమావేశం జరిగింది. అమెరికా 250వ స్వాతంత్ర్య వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ సమావేశానికి భారత పరిశ్రమలకు చెందిన పలువురు ఉన్నత స్థాయి ప్రతినిధులు హాజరయ్యారు. రక్షణ పరికరాల తయారీ, సూక్ష్మ ఎలక్ట్రానిక్ పరికరాలు, ఔషధాలు, సాంకేతిక రంగాల్లో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఆధునిక సరఫరా వ్యవస్థలు, పెట్టుబడుల విస్తరణపై చర్చించారు. దక్షిణ భారతదేశంలో వ్యాపార, పారిశ్రామిక అవకాశాలను మరింత పెంచడమే లక్ష్యంగా సమావేశం సాగింది.
అమెరికా-భారత్ భాగస్వామ్యం కేవలం వ్యూహాత్మక సంబంధాలకే పరిమితం కాకుండా రక్షణ, సాంకేతికత, జీవశాస్త్ర ఆధారిత పరిశ్రమలు, అంతరిక్ష రంగాల్లో ఆచరణాత్మక సహకారంగా మారుతోందని రాయబారి సెర్జియో గోర్ అన్నారు. ఇరు దేశాల మధ్య మార్కెట్ అవకాశాలను విస్తరించడం, రక్షణ రంగంలో సంయుక్త తయారీని పెంచడం, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల వ్యాపారవేత్తలు అమెరికా-భారత్ సహకారంతో రూపొందించిన వివిధ కార్యక్రమాలను పెట్టుబడులు, సరఫరా వ్యవస్థల భాగస్వామ్యాలు, మార్కెట్ విస్తరణకు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!