

తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు కళారత్న నల్ల విజయ్ కుమార్ అగ్గిపెట్టెలో ఇమిడే అరుదైన పట్టుచీరను అమ్మవారికి సమర్పించారు. ఈ ప్రత్యేక వస్త్రాన్ని దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడుకు అందజేశారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యురాలు కోడె కాంతివర్ధిని పాల్గొన్నారు. వారం రోజుల పాటు సంప్రదాయ మగ్గంపై నేసిన ఈ ఇక్కత్ పట్టుచీర 5.5 మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు కలిగి ఉండగా, దాని బరువు కేవలం 200 గ్రాములు మాత్రమే. ప్రత్యేకంగా మడతపెడితే చిన్న అగ్గిపెట్టెలో సులభంగా ఇమిడేలా దీనిని రూపొందించారు.
ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ అమ్మవారి అనుగ్రహంతోనే ఈ అరుదైన కళాఖండాన్ని రూపొందించగలిగామని తెలిపారు. ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు ఆయన ప్రతిభను అభినందిస్తూ, చేనేత రంగం భారతీయ సంస్కృతిలో విడదీయరాని భాగమని అన్నారు. చేనేత కేవలం ఒక వృత్తి మాత్రమే కాకుండా తరతరాలుగా కొనసాగుతున్న గొప్ప కళ అని పేర్కొన్నారు. చేనేత కళాకారుల సృజనాత్మకత, నైపుణ్యానికి ఈ పట్టుచీర నిదర్శనమని కొనియాడుతూ, ప్రజలు చేనేత వస్త్రాలను ఆదరించాలని పిలుపునిచ్చారు. అనంతరం విజయ్ కుమార్ మరియు ఆయన బృందానికి దేవస్థానం ప్రత్యేక దర్శనం కల్పించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!