

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ప్రత్యేక వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అటవీ దళాల అధిపతి (హెచ్ఓఎఫ్ఎఫ్) వినయ్ కుమార్ మంఖాల్ రేంజ్లోని మహాత్మా జ్యోతిరావు పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా గత జూన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన వనమహోత్సవాన్ని సెప్టెంబర్ చివరి వారంలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వినయ్ కుమార్ తెలిపారు.
ప్రత్యేక డ్రైవ్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజే సుమారు 10 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, దాని సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు పుట్టినరోజుల సందర్భంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీసీఎఫ్ ప్రియాంక వర్గీస్, రంగారెడ్డి జిల్లా డీఎఫ్ఓ శివ్ ఆశిష్ సింగ్, అదనపు కలెక్టర్ చంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!