

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను రియల్టైమ్లో పర్యవేక్షించడంతోపాటు భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తిరుమలలోని పద్మావతి అతిథి గృహం వద్ద నాలుగు కాళ్ల రోబోట్ డాగ్ పనితీరును టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి పరిశీలించారు. మనుషులు వెళ్లేందుకు ప్రమాదకరంగా లేదా కష్టంగా ఉండే అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షించేందుకు ఈ రోబోట్ను వినియోగించే అవకాశాలను అధికారులు పరిశీలించారు. రోబోట్లో ఆప్టికల్ కెమెరా, థర్మల్ ఇమేజింగ్ కెమెరా, 360 డిగ్రీల లైడార్, వివిధ సెన్సార్లు, కృత్రిమ మేధస్సు వంటి ఆధునిక సాంకేతికతలు ఉన్నాయి. చీకటి, పొగమంచు వంటి పరిస్థితుల్లోనూ జంతువుల కదలికలను గుర్తించి పర్యవేక్షించేందుకు ఇవి ఉపయోగపడతాయి.

రోబోట్లోని కృత్రిమ మేధస్సు వ్యవస్థ పెద్ద జంతువులు, మనుషులు, వాహనాలు, పశువులను గుర్తించి వేర్వేరుగా వర్గీకరించగలదు. వన్యప్రాణుల కదలికలను గుర్తించిన వెంటనే భౌగోళిక స్థానంతో కూడిన హెచ్చరికలను పంపడంతోపాటు ప్రత్యక్ష వీడియో, థర్మల్ చిత్రాలను నియంత్రణ గది, గస్తీ సిబ్బందికి అందించే విధానాన్ని పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా అలిపిరి–తిరుమల కాలిబాటకు సమీపంలోని అటవీ ప్రాంతాల్లో చిరుతలు, ఇతర వన్యప్రాణుల సంచారాన్ని ముందుగానే గుర్తించి భక్తులను అప్రమత్తం చేయడానికి ఈ సాంకేతికత ఉపయోగపడనుంది. జంతువులు భక్తుల రాకపోకల ప్రాంతాల వైపు వస్తే శబ్ద, కాంతి సంకేతాల ద్వారా భౌతికంగా తాకకుండా వాటిని తిరిగి అడవిలోకి మళ్లించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఉన్న కెమెరా ట్రాప్లు, కాలినడక గస్తీ, అటవీ సిబ్బంది నిఘాకు ప్రత్యామ్నాయంగా కాకుండా, వాటికి అదనంగా మొబైల్ నిఘా వ్యవస్థగా రోబోట్ను ఉపయోగించే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!