

విద్యాభ్యాసం సంప్రదాయ డిగ్రీలతోనే ముగిసిపోకూడదని, యువత స్కిల్లింగ్, అప్స్కిల్లింగ్, రీ-స్కిల్లింగ్పై దృష్టి పెట్టాలని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సూచించారు. గురువారం ఆదివాసీ భవన్లో జరిగిన మైనారిటీ ఎక్సలెన్స్ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ మార్కెట్ వేగంగా మారుతోందని, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి సంప్రదాయ విద్యార్హతలతోనే ఉద్యోగాలు లభించే పరిస్థితి లేదన్నారు. జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, చైనా, తైవాన్ వంటి దేశాల్లో నైపుణ్యం ఉన్న వారికి భారీ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించేందుకు స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించడంతో పాటు పాలిటెక్నిక్ విద్యను నైపుణ్యాభివృద్ధితో అనుసంధానం చేస్తున్నామని తెలిపారు.
మైనారిటీ యువతను ‘తాలీమ్ నుంచి తరక్కీ’ దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. మైనారిటీ కుటుంబాల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి ప్రభుత్వ అధికారులు, ఇంజినీర్లు, ఐఏఎస్, ఐపీఎస్, న్యాయవాదులుగా ఎదగడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ప్రభుత్వం అండగా ఉంటుందని, హజ్ యాత్రికులకు ఆర్థిక సహాయం, ప్రమాదాల్లో మృతుల కుటుంబాలకు తక్షణ సాయం అందిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మైనారిటీ ఓటర్ల పేర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పేర్లు, ఇంటిపేర్లు, స్పెల్లింగ్లో స్వల్ప తేడాల వల్ల ఓటర్ల జాబితాలో సమస్యలు రావొచ్చని, యువత ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల ఓట్లు ఉన్నాయో లేదో పరిశీలించాలని పిలుపునిచ్చారు. అవసరమైతే ప్రతి ఒక్కరూ ఒక రేవంత్రెడ్డిగా మారి తమ ఓటు హక్కును కాపాడుకోవాలని కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!