

2001 సెప్టెంబర్ 11 ఉగ్రదాడుల తర్వాత అమెరికా విమానాశ్రయాల్లో అమల్లోకి వచ్చిన కఠిన భద్రతా నిబంధనల్లో కొన్ని మార్పులు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. టికెట్ లేని అర్హత కలిగిన వ్యక్తులు కూడా భద్రతా తనిఖీలు పూర్తి చేసుకుని విమానాశ్రయంలోని గేట్ ప్రాంతానికి వెళ్లేలా TSA కొత్త కార్యక్రమాన్ని తీసుకురానుంది. దీంతో ప్రయాణికులను కుటుంబ సభ్యులు గేట్ వరకు సాగనంపే అవకాశం ఉంటుంది. అలాగే లేఓవర్ సమయంలో స్నేహితులను కలవడం, భద్రతా తనిఖీల తర్వాత ఉన్న రెస్టారెంట్లు, దుకాణాలను సందర్శించడం వంటి సదుపాయాలు కూడా అందుబాటులోకి రావచ్చు.
అయితే ఈ సదుపాయం తొలుత అందరికీ వర్తించదు. TSA PreCheck సభ్యులు లేదా Known Traveler Number ఉన్నవారు ముందుగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. గేట్ వరకు వెళ్లాలనుకునే వారు తమ సందర్శనకు ఒకటి నుంచి మూడు రోజుల ముందు ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ పైలట్ కార్యక్రమాన్ని మొదట 13 అమెరికా విమానాశ్రయాల్లో ప్రారంభించనున్నట్లు సమాచారం. మరోవైపు PreCheck ప్రయాణికులు నీటితో నింపిన బాటిళ్లను తీసుకెళ్లేందుకు అనుమతించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఆధునిక CT స్కానర్లు ద్రవ రూపంలోని పేలుడు పదార్థాలను మెరుగ్గా గుర్తించగలగడంతో కొన్ని పాత ఆంక్షలను సడలించే అవకాశం ఏర్పడిందని భద్రతా నిపుణులు చెబుతున్నారు. అయితే భద్రత విషయంలో రాజీ పడకూడదని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!