

ఎల్నినో ప్రభావంతో రాష్ట్ర వ్యవసాయ రంగంపై ఏర్పడుతున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని కూరగాయల సాగు, ఆర్గానిక్ వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ సంస్థలోని బోధి పెవిలియన్లో నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను పరిశీలించిన అనంతరం ఆయన వ్యవసాయ శాఖతో సమన్వయం చేసుకుని సబ్సిడీపై విత్తనాలు అందించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించే సెంట్రలైజ్డ్ కిచెన్ల పరిసర ప్రాంతాల్లో కూరగాయల సాగును విస్తరించాలని, ఆర్గానిక్ సాగుపై రైతులకు అవగాహన కల్పించి వారు పండించిన పంటలను నేరుగా కొనుగోలు చేసే విధానాన్ని అమలు చేయాలని తెలిపారు. రైతులకు సాంకేతిక సూచనలు అందించేందుకు వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించాలని సూచించారు.
నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం, ఈ ఏడాది తగినంత వర్షపాతం లేకపోవడంతో సాగు విస్తీర్ణం గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 79.49 లక్షల ఎకరాల నుంచి 74.56 లక్షల ఎకరాలకు తగ్గింది. గ్రామాల వారీగా అత్యవసర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు, కూరగాయల వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని కమిటీ సూచించింది. ఆయా పంటల విత్తనాలను 75 శాతం సబ్సిడీపై అందించడం, ప్రత్యామ్నాయ పంటలకు కొత్త రుణాలు మంజూరు చేయడం, డ్రిప్, స్ప్రింక్లర్ సాగు పద్ధతులకు 75 నుంచి 90 శాతం వరకు సబ్సిడీ కల్పించడం, సాగునీటికి నిరంతర విద్యుత్ సరఫరా, పశుగ్రాస సాగు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తల సాంకేతిక సహకారం, హైదరాబాద్ పరిసరాల్లో కూరగాయల సాగు విస్తరణ, రైతుబజార్లకు రవాణా సౌకర్యం, గ్రామీణ ప్రాంతాల్లో డైరీ యూనిట్లకు ఆర్థిక సహాయం, అత్యవసర చర్యల అమలుకు గ్రామస్థాయి బృందాల ఏర్పాటు వంటి పలు కీలక సిఫారసులు చేసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!