

ములుగు జిల్లా పాలంపేటలోని ‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపు లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ పరిధిలోని భారత పురావస్తు సర్వేక్షణ (ASI) ఆగస్టు 31న జారీ చేసిన నోటిఫికేషన్ను ‘గెజిట్ ఆఫ్ ఇండియా’ ప్రత్యేక సంచికలో ప్రచురించింది. ప్రాచీన కట్టడాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల చట్టం-1958లోని సెక్షన్ 4(3) కింద ఈ ప్రకటన వెలువడింది.
పాలంపేట గ్రామంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) ఆలయానికి నైరుతి దిశలో గొల్లల గుడి ఉంది. తూర్పు ముఖంగా ఉన్న మండపం, దాని చుట్టూ మూడు గర్భాలయాలతో ఇది త్రికూటాలయ నిర్మాణాన్ని కలిగి ఉంది. శిల్పాలతో అలంకరించిన ప్రహరీ, పైకప్పు అంచులు, ద్వారబంధాల వద్ద చెక్కిన హంసల వరుస, సున్నితమైన రంధ్రాల వల పనితనం ఈ ఆలయ ప్రత్యేకతను చాటుతున్నాయి.
ప్రధాన ఆలయం ముందు రెండు ఉప ఆలయాలు ఉన్నాయి. వీటికి అందంగా చెక్కిన ద్వారపాలకుల విగ్రహాలు, అలంకరణలతో కూడిన అంతరాలయాలు ఉన్నాయి. ప్రధాన ఆలయంలో ఉత్తర, దక్షిణ, పశ్చిమ దిశల్లో మూడు గర్భాలయాలు ఉండగా, గోడలపై విష్ణుమూర్తి, లక్ష్మి, గణేశుడు, మహిషాసురమర్దిని విగ్రహాలు కనిపిస్తాయి. జంతు ఆకృతులు, పుష్పాలంకరణలతో కూడిన ఎత్తైన వేదికపై నిర్మించిన ఈ ఆలయం కాకతీయుల శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!