

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సోషల్ మీడియాలో వ్యాపించిన ఓ నకిలీ పోస్టు ఇజ్రాయెల్, అమెరికాలో కలకలం రేపింది. ఆగస్టు 5న భారత్కు చెందిన ఓ ఎక్స్ ఖాతాలో ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించి ఓ పోస్టు వెలువడింది. ఇజ్రాయెల్, అమెరికా వద్ద అణ్వాయుధాలు ఉన్నంతకాలం ఇరాన్ తన అణు ప్రయత్నాలను విరమించుకోదని ఐఆర్జీసీ కమాండర్ అహ్మద్ వాహిదీ చెప్పినట్లు అందులో పేర్కొన్నారు. కమాండర్ ఫొటోతో పాటు అణు పరీక్షను పోలిన ఏఐ రూపొందించిన చిత్రాన్ని కూడా పోస్టు చేశారు. ఈ ప్రచారం వేగంగా వైరల్ కావడంతో ఇజ్రాయెల్ మీడియా, అమెరికా రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది.
అయితే ఆ పోస్టుపై అనంతరం నిర్వహించిన ఫ్యాక్ట్చెక్లో అది పూర్తిగా నకిలీ ప్రచారమని తేలింది. ఎలాంటి విశ్వసనీయ ఆధారాలు లేకపోయినా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఐరాసలో అమెరికా రాయబారి మైక్ వాల్జ్ తదితరులు ఆ సమాచారాన్ని ప్రస్తావించారు. ఫేక్ అని తేలిన తర్వాత వాల్జ్ తన పోస్టును తొలగించారు. అత్యంత సున్నితమైన అంతర్జాతీయ ఘర్షణల సమయంలో ధ్రువీకరణ లేని సోషల్ మీడియా పోస్టులు, ఏఐ చిత్రాలు ఎంతటి గందరగోళానికి దారితీయగలవో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. ఇరాన్ తన అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసమేనని చెబుతుండగా, అమెరికా, ఇజ్రాయెల్ మాత్రం దాని యురేనియం శుద్ధిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!