

కోలీవుడ్ స్టార్ ధనుష్ రాజకీయ ఎంట్రీపై మరోసారి చర్చ మొదలైంది. ఇప్పటివరకు ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించకపోయినా, తాజాగా అభిమాన సంఘం తీసుకున్న నిర్ణయం తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. కోయంబత్తూరు నార్త్, కౌండంపాళయం, సింగనల్లూర్, సులూర్, మేట్టుపాళయం నియోజకవర్గాల్లో కొత్త సంక్షేమ సంఘాలను ఏర్పాటు చేసి, సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని ఆల్ ఇండియా ధనుష్ ఫ్యాన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ సూచించింది. ఇందులో రాజకీయ పార్టీ, ఎన్నికలు లేదా ప్రత్యక్ష రాజకీయ ప్రవేశంపై ఎలాంటి ప్రస్తావన లేకపోయినా, నియోజకవర్గాల వారీగా అభిమాన సంఘాలను బలోపేతం చేయడం చర్చకు దారి తీసింది.
ఇటీవల అభిమానులు నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో ధనుష్ మాట్లాడుతూ, అభిమానుల ఐక్యతను సినిమా వేడుకలకే పరిమితం చేయకుండా ప్రజా సంక్షేమానికి ఉపయోగించాలని పిలుపునిచ్చారు. దీంతో ఆయన రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు మరింత పెరిగాయి. గతంలో విజయ్ కూడా అభిమాన సంఘాలను బలోపేతం చేసి రాజకీయాల్లోకి రావడంతో ధనుష్ విషయంలోనూ అలాంటి వ్యూహమేనా అనే చర్చ జరుగుతోంది. అయితే ధనుష్ ఇప్పటివరకు ఎలాంటి రాజకీయ సంకేతాలు ఇవ్వలేదు. ప్రస్తుతం ఆయన పలు క్రేజీ సినిమాలతో బిజీగా ఉన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!