

సరికొత్త పద్ధతుల్లో సైబర్ మోసాలకు పాల్పడుతున్న హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ ముఠాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనర్ హెచ్చరించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే ఆర్టీసీ బస్సులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో సీనియర్ సిటిజన్లు, సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉన్న అమాయకులను ఈ ముఠాలు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తెలిపారు. ముందుగా వారు స్మార్ట్ఫోన్ వినియోగదారులను గుర్తించి, స్క్రీన్ లాక్ ఎలా ఓపెన్ చేస్తున్నారో గమనించి, ఆ తర్వాత ఫోన్ను చోరీ చేస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఫోన్ లాక్ను ఓపెన్ చేయడం సాధ్యం కాకపోతే సోషల్ ఇంజినీరింగ్కు పాల్పడుతున్నారని చెప్పారు. బాధితుడికి ఫోన్ చేసి తాము బస్సు కండక్టర్ లేదా డ్రైవర్ అని, ఫోన్ బస్సులో దొరికిందని చెప్పడం, రోడ్డుపై ఫోన్ దొరికిందని చెప్పడం వంటి నాటకాలతో స్క్రీన్ పాస్వర్డ్ను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు.
ఫోన్ పోయిన వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా సంబంధిత టెలికాం సర్వీస్ ప్రొవైడర్ను సంప్రదించి సిమ్ కార్డును బ్లాక్ చేయించాలని పోలీసులు సూచించారు. అనంతరం బ్యాంక్ కస్టమర్ కేర్ను సంప్రదించి నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వానికి చెందిన CEIR సేవ ద్వారా పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ను IMEI వివరాలతో బ్లాక్ చేయవచ్చు. ఖాతా నుంచి అనధికారికంగా డబ్బులు కట్ అయినట్లు గుర్తిస్తే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ముఖ్యంగా యువత తమ కుటుంబాల్లోని సీనియర్ సిటిజన్లకు ఇలాంటి సరికొత్త సైబర్ మోసాలపై అవగాహన కల్పించి, ప్రయాణాల్లో ఫోన్లు ఉపయోగించేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండేలా చూడాలని సీపీ సజ్జనర్ సూచించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!