

చేయూత సామాజిక భద్రతా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువును తెలంగాణ ప్రభుత్వం మరో 15 రోజుల పాటు పొడిగించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్లో కొనసాగుతున్న ప్రత్యేక ప్రక్రియ కారణంగా పలువురు అర్హులు గత గడువులోగా దరఖాస్తులు సమర్పించలేకపోయినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ముఖ్యంగా దివ్యాంగులు మరింత సమయం ఇవ్వాలని మంత్రి సీతక్కను కోరడంతో వారి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
గడువు పొడిగింపుతో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, ఇతర పేద కుటుంబాలకు చెందిన వారు సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభించింది. సామాజిక భద్రతా పెన్షన్లు పేద కుటుంబాలకు ప్రభుత్వ భరోసా అని మంత్రి సీతక్క అన్నారు. అర్హత ఉన్న ఒక్కరూ సమాచారం లేకపోవడం లేదా ఇతర కారణాలతో సంక్షేమ పథకానికి దూరం కాకూడదని పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణలో అధికారులు, సిబ్బంది ప్రజలకు పూర్తి సహకారం అందించాలని, ముఖ్యంగా దివ్యాంగులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా అవసరమైన సహాయం అందించాలని ఆదేశించారు. సెప్టెంబర్ 15ను తుది అవకాశంగా భావించి అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!