

అమరావతి: రాజధాని అమరావతిలో జరిగిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న ఆయన.. అభివృద్ధి చెందిన భారతదేశంతో పాటు స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జాతీయ జెండా స్వాతంత్య్రానికి, ఆత్మగౌరవానికి, ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. “నా దేశం-నా బాధ్యత” అనే స్ఫూర్తితో దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. పేదరిక నిర్మూలన, ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి, నీటి భద్రత, అగ్రిటెక్, లాజిస్టిక్స్, ఇంధన వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు, స్వచ్ఛాంధ్ర, డీప్టెక్ వంటి పది అంశాలతో స్వర్ణాంధ్ర విజన్ను రూపొందించామని తెలిపారు.
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ అనేక సవాళ్లను ఎదుర్కొందని చంద్రబాబు అన్నారు. 2019-24 మధ్య రాష్ట్రంలో పరిస్థితులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, గత ప్రభుత్వం భారీ ఆర్థిక భారాన్ని మిగిల్చిందని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని, ఆ తీర్పును అధికారంగా కాకుండా రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతగా స్వీకరించామని చెప్పారు. పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ వంటి ప్రాజెక్టులకు కేంద్రం సహకరిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర వృద్ధి రేటు మెరుగుపడిందని, సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తోందని తెలిపారు. విశాఖ, అమరావతి, తిరుపతి ప్రాంతాల అభివృద్ధితో పాటు ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందేలా వికేంద్రీకృత అభివృద్ధికి కృషి చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!