

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదించిన బ్యారేజీ నిర్మాణంపై కీలక ముందడుగు పడింది. ఈ అంశంపై సెప్టెంబర్ 1న న్యూఢిల్లీలో మహారాష్ట్ర, తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శులతో కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) సమావేశం నిర్వహించనుంది. తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి జూన్ 11న ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన నేపథ్యంలో ఈ భేటీ జరగనుంది. వార్థా, వెన్గంగా నదులపై రెండు బ్యారేజీలను 150 మీటర్ల ఎత్తుతో నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. వీటి వల్ల తెలంగాణ, మహారాష్ట్రలోని గ్రామాలకు ముంపు ఉండదని ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక పేర్కొంది.
తుమ్మిడిహెట్టి బ్యారేజీని 148 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు 2016లో మహారాష్ట్రతో తెలంగాణ ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి 2015లోనే హైడ్రాలజీ అనుమతి లభించగా, పలు ఇతర అనుమతులు కూడా గతంలోనే వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్ 1న జరిగే సమావేశంలో మహారాష్ట్రను 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి ఒప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నించనుంది. మరోవైపు, కృష్ణా, గోదావరి జలాలపై ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న వివాదాల పరిష్కారానికి సెప్టెంబర్ 7న సీడబ్ల్యూసీ మరో సమావేశం నిర్వహించనుంది. కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు, ఇరు రాష్ట్రాల అధికారులతో ఈ భేటీ జరగనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!