

రాబోయే వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త నియోజకవర్గాల పునర్విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. రాజకీయ విభేదాలకు తావు ఇవ్వకుండా, పార్టీల అభ్యంతరాలను పరిశీలించి విస్తృత మద్దతు కూడగట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
ఇంతకుముందు మహిళా రిజర్వేషన్ బిల్లు, పునర్విభజన బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టినా రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండో వంతు మద్దతు లభించలేదు. లోక్సభకు హాజరైన 528 మంది సభ్యుల్లో 298 మంది అనుకూలంగా ఓటు వేయగా, 230 మంది వ్యతిరేకించారు. అవసరమైన 352 ఓట్లు రాకపోవడంతో ఆ బిల్లులు ఆమోదం పొందలేదు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిణామాలు కేంద్రానికి అనుకూలంగా మారుతున్నాయని భావిస్తున్నారు. కొన్ని ప్రతిపక్ష పార్టీలు సవరించిన ప్రతిపాదనపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం లోక్సభలోని 543 స్థానాలను 850కు పెంచాలని కేంద్రం పరిశీలిస్తోంది. తొలి దశలో 816 స్థానాలను వినియోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి రాష్ట్రంలో స్థానాలను రెట్టింపు చేస్తే సమాన న్యాయం జరుగుతుందని కేంద్రం వాదిస్తుండగా, దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రభావం తగ్గే అవకాశం ఉందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!