

ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పెట్టుబడిదారుల గమ్యస్థానంగా వేగంగా ఎదుగుతోందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కర్నూలు జిల్లా హోసూరులో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు, అనంతపురం జిల్లా కనేకల్లులో 400 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టుకు ఆయన భూమిపూజ చేశారు. రూ.5,750 కోట్ల వ్యయంతో టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ, సుజ్లాన్ సంయుక్తంగా చేపడుతున్న ఈ 800 మెగావాట్ల హరిత విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా 1,200 మందికి ఉపాధి లభించనుండగా, భూములు ఇచ్చిన 1,100 మంది రైతులకు 30 సంవత్సరాల పాటు లీజు ఆదాయం అందనుంది.
ప్రస్తుతం ప్రపంచ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, ప్రముఖ భారతీయ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని లోకేశ్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పునరుత్పాదక ఇంధన రంగంలో దేశంలో అగ్రస్థానానికి తీసుకెళ్లడమే లక్ష్యమని, ఏటా 15,000 మెగావాట్ల హరిత విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఎగుమతులకు ఏపీని ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. టాటా పవర్ సీఈఓ ప్రవీర్ సిన్హా ఈ ప్రాజెక్టులు నిర్ణీత గడువులో పూర్తవుతాయని చెప్పగా, సుజ్లాన్ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ త్వరలోనే పునరుత్పాదక ఇంధన పవర్హౌస్గా మారుతుందని అభిప్రాయపడ్డారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!