

పాకిస్థాన్లో తయారైనట్లు పేర్కొంటున్న రెండు ఫెయిర్నెస్ క్రీములపై కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ) ప్రజారోగ్య హెచ్చరిక జారీ చేసింది. ‘గోరీ బ్యూటీ క్రీమ్’, ‘చాందినీ వైటెనింగ్ క్రీమ్’ ఉత్పత్తులు భారత్లో విక్రయించేందుకు అనుమతి పొందలేదని, వీటిలో నిర్దేశిత పరిమితులకు మించి హెవీ మెటల్స్ ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయిందని సీడీఎస్సీఓ తెలిపింది. ఈ ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దని, ఇప్పటికే కొనుగోలు చేసి ఉంటే వినియోగించవద్దని వినియోగదారులకు సూచించింది. అధిక మోతాదులో హెవీ మెటల్స్ ఉండటం వల్ల ఆరోగ్యానికి, విష ప్రభావాలకు ముప్పు ఉండొచ్చని హెచ్చరించింది.
కాస్మొటిక్స్ తయారీ, దిగుమతులను డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టం, 1940, కాస్మొటిక్స్ రూల్స్, 2020 కింద నియంత్రిస్తారు. వినియోగదారులు క్రీమ్లు, ఇతర సౌందర్య ఉత్పత్తులు కొనుగోలు చేసే సమయంలో లైసెన్స్ నంబర్, బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, గడువు తేదీ వంటి వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని సీడీఎస్సీఓ సూచించింది. దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల విషయంలో సంబంధిత రిజిస్ట్రేషన్ నంబర్ను కూడా తనిఖీ చేయాలని తెలిపింది. అనుమతులు, తయారీ వివరాలు స్పష్టంగా లేని ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దని, ముఖ్యంగా చర్మాన్ని తెల్లగా మారుస్తామంటూ హామీ ఇచ్చే క్రీముల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!