

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు మరియు రీవాల్యుయేషన్ ప్రక్రియలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఫలితాలు విడుదలై రెండు వారాలు గడిచినా విద్యార్థులు, తల్లిదండ్రులు ఇప్పటికీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది సీబీఎస్ఈ ప్రవేశపెట్టిన ఆన్స్క్రీన్ మార్కింగ్ విధానంలో తలెత్తిన సాంకేతిక లోపాలు సమస్యలకు ప్రధాన కారణమయ్యాయి. పరీక్షలకు హాజరైన దాదాపు 17 లక్షల మంది విద్యార్థుల్లో 4.04 లక్షల మందికి పైగా విద్యార్థులు సుమారు 11 లక్షల జవాబుపత్రాల స్కాన్ కాపీల కోసం దరఖాస్తు చేయడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది.
మే 13న ఫలితాలు విడుదలైనప్పటి నుంచి సీబీఎస్ఈ ఆన్లైన్ పోర్టల్ తరచూ పనిచేయకపోవడంతో విద్యార్థులు గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. అనేక స్కాన్ కాపీలు అస్పష్టంగా కనిపించగా, కొందరికి ఇతర విద్యార్థుల జవాబుపత్రాలు పంపిన ఘటనలు కూడా వెలుగుచూశాయి. వేదాంత్ శ్రీవాస్తవ అనే విద్యార్థి తనకు పంపిన ఫిజిక్స్ జవాబుపత్రం తనది కాదని సోషల్ మీడియాలో ఆధారాలతో వెల్లడించడంతో ఈ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అనంతరం ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్లు తారుమారైనట్లు సీబీఎస్ఈ అంగీకరించడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. రీవాల్యుయేషన్ ప్రక్రియలో పారదర్శకత, బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!