

విద్యా హక్కు చట్టం-2009లోని సెక్షన్ 12(1)(c) ప్రకారం ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో నిరుపేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు కల్పించే 25 శాతం ఉచిత ప్రవేశాల మార్గదర్శకాలను సవరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 16 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను సమీక్షించి, అవసరమైన సవరణలు సూచించడంతో పాటు ఉచిత ప్రవేశాల ప్రక్రియ పకడ్బందీగా అమలయ్యేలా చర్యలను ప్రతిపాదించడం ఈ కమిటీ ప్రధాన బాధ్యతగా ఉండనుంది.
ఈ ఏడాది జనవరి 13న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా మార్గదర్శకాలను సవరించనున్నారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సమీమ్ అన్సారియా కమిటీకి చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. 25 శాతం ఉచిత ప్రవేశాల నిబంధనలు అర్హులైన విద్యార్థులకు సమర్థంగా చేరేలా, ప్రస్తుత మార్గదర్శకాల్లో అవసరమైన మార్పులు చేయడంపై కమిటీ దృష్టి సారించనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!