
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగితే భారత ఆర్థిక వృద్ధి అంచనాలపై ప్రభావం పడే అవకాశం ఉందని క్రిసిల్ ఇంటెలిజెన్స్ పేర్కొంది. యుద్ధ పరిస్థితుల కారణంగా ముడి చమురు మరియు ఇతర కమోడిటీ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, 2026–27 ఆర్థిక సంవత్సరంలో భారత వాస్తవ జీడీపీ వృద్ధి సుమారు 7.1 శాతానికి పరిమితం కావొచ్చని తన నివేదికలో వెల్లడించింది. అయితే ఇది ఇంకా ఆరోగ్యకరమైన వృద్ధిగా పరిగణించవచ్చని క్రిసిల్ తెలిపింది. ముఖ్యంగా ప్రైవేటు వినియోగం పెరగడం, ప్రైవేటు పెట్టుబడులు కూడా అధికంగా ఉండటం వృద్ధికి తోడ్పడవచ్చని పేర్కొంది. అలాగే రిటైల్ ద్రవ్యోల్బణం 2026–27లో సుమారు 4.3 శాతానికి పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. 2025–26లో ఇది 2.5 శాతంగా ఉండవచ్చని తెలిపింది. ప్రస్తుతం ఉన్న కనిష్ఠ స్థాయి నుంచి ద్రవ్యోల్బణం మళ్లీ సాధారణ స్థాయికి చేరుకునే అవకాశముందని నివేదిక పేర్కొంది.
ఇక ముడి చమురు ధరల పెరుగుదల వల్ల భారత ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్పై ఒత్తిడి పెరుగుతోందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్, మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్, ఫిచ్ రేటింగ్స్ తమ నివేదికల్లో పేర్కొన్నాయి. భారత్ తన ముడి చమురు అవసరాల్లో సుమారు 88 శాతం, సహజ వాయువు అవసరాల్లో సగం వరకు దిగుమతులపై ఆధారపడుతోంది. అందులో హర్మూజ్ జలసంధి ద్వారా 30 నుంచి 55 శాతం సరఫరా జరుగుతోంది. వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు కేవలం 10 రోజుల వినియోగానికే సరిపోతే, వాణిజ్య నిల్వలు సుమారు 65 రోజుల వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
ప్రభుత్వం నుంచి మద్దతు ఉన్నప్పటికీ చమురు లేదా ఎల్ఎన్జీ సరఫరాలో అంతరాయాలు ఎక్కువకాలం కొనసాగితే కంపెనీల క్రెడిట్ ప్రొఫైల్పై తాత్కాలిక ఒత్తిడి పడే అవకాశముందని ఫిచ్ పేర్కొంది. ముడి పదార్థాల వ్యయం పెరగడం వల్ల మార్కెటింగ్ మార్జిన్లు తగ్గే అవకాశం ఉందని మూడీస్ అంచనా వేసింది. అలాగే ప్రభుత్వ ఆదేశాలు మరియు పెరుగుతున్న ధరల ప్రభావంతో మార్జిన్లు తగ్గొచ్చని ఎస్ అండ్ పీ వెల్లడించింది. రిలయన్స్ వంటి ప్రైవేటు కంపెనీలు మొదట నిల్వల వల్ల కొంత లాభం పొందినా, సరఫరాలో అంతరాయం ఏర్పడితే తరువాత సమస్యలు ఎదుర్కొనే అవకాశముందని విశ్లేషకులు పేర్కొన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!