

ఆర్థిక వృద్ధి గాడిలో పడడంతో పరపతి వృద్ధి రేటు ఊపందుకుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరాని(2025-26)కి తమ రుణాల వృద్ధి రేటు అంచనాను 12 శాతం నుంచి 14 శాతానికి పెంచినట్టు ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి చెప్పారు. రిటైల్, వ్యవసాయ, ఎంఎస్ఎంఈ(ఆర్ఏఎం) రుణాలు ఇందుకు ప్రధానంగా దోహదం చేస్తాయన్నారు. ప్రస్తుతం ఎంఎస్ఎంఈల రుణ గిరాకీ 17 నుంచి 18 శాతం చొప్పున పెరుగుతుంటే, వ్యవసాయ, రిటైల్ రుణాల వృద్ధి రేటు 14 శాతం చొప్పున పెరుగుతున్నట్టు తెలిపారు. తమ మొత్తం రుణాల్లో 67 శాతం వాటా ఉన్న ఆర్ఏఎం రుణాలు ఈ సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికే రూ.25 లక్షల కోట్లు మించి పోయినట్టు చెప్పారు. ఇందులో గృహ రుణాలే రూ.9 లక్షల కోట్ల వరకు ఉన్నట్టు పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ప్రస్తుతం పసిడి రుణాల వృద్ధి రేటు కూడా రెండు అంకెల్లో ఉందని ఎస్బీఐ చైర్మన్ వెల్లడించారు. ఈ జూన్తో ముగిసిన త్రైమాసికం వరకు అంతంత మాత్రంగానే ఉన్న ఎస్బీఐ కార్పొరేట్ రుణాల వృద్ధి రేటు కూడా సెప్టెంబరు త్రైమాసికంలో కొద్దిగా కోలుకుని 7.1 శాతానికి చేరింది. ఆర్బీఐ రెపో రేటును మరో పావు శాతం తగ్గించడంతో రుణాలకు గిరాకీ మరింత పెరగనుందని ఎస్బీఐ చీఫ్ చెప్పారు. దీని వల్ల ఈ ఆర్థిక సంవత్సరం మూడు శాతం నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) సాధించాలన్న తమ లక్ష్యానికీ ఎలాంటి ఇబ్బంది ఉండక పోవచ్చన్నారు. మరో ఐదారు సంవత్సరాల వరకు ఈక్విటీ షేర్ల జారీ ద్వారా నిధులు సమీకరించాల్సిన అవసరం ఎస్బీఐకి లేదని శెట్టి తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!