

గ్రామాలు, చిన్న పట్టణాల్లో కూడా యూపీఐ సేవలను వినియోగిస్తున్న మహిళల శాతం గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా కిరాణా సరకుల కొనుగోలు, విద్యుత్, నీటి వంటి వినియోగ బిల్లుల చెల్లింపుల కోసం యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్)ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని పేనియర్బై నివేదిక వెల్లడించింది. ప్రజలు వేగంగా డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లుతున్నారనే విషయాన్ని ఇది స్పష్టం చేస్తోంది. పేనియర్బై ఉమెన్ ఫైనాన్షియల్ ఇండెక్స్ 2026 ప్రకారం పెట్టుబడులు, ఆస్తులకు సంబంధించిన ఆర్థిక ఉత్పత్తులపై మహిళల్లో అవగాహన కూడా క్రమంగా పెరుగుతోంది.
గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో దాదాపు 38% మహిళలు రోజువారీ నిత్యావసరాల కొనుగోళ్ల కోసం వారానికి కనీసం ఒక్కసారైనా యూపీఐ ఉపయోగిస్తున్నట్లు సర్వే తెలిపింది. మహిళల్లో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతున్నదని, పొదుపు చేయాలనే ధోరణి కూడా ఎక్కువవుతున్నదని నివేదిక వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న మహిళల్లో 85% మంది తమ కుటుంబాలకు ప్రధాన పొదుపుదారులమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా గ్రామీణ మరియు చిన్న పట్టణ ప్రాంతాల్లో డిజిటల్, ఆర్థిక సేవలు అందిస్తున్న 10,000 మంది మహిళా ఏజెంట్లపై ఈ సర్వే నిర్వహించారు.
నివేదిక ప్రకారం సుమారు 44% మహిళలు స్థానిక సేవా కేంద్రాల మద్దతుతో చిన్న మొత్తాల సిప్ల ద్వారా పసిడి ఆధారిత పొదుపు పథకాలలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్ల వంటి సులభంగా నగదు ఉపసంహరణ చేసుకునే చిన్న మొత్తాల డిపాజిట్ ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోంది. 98% మంది మహిళలు వీటిలో పొదుపు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే మ్యూచువల్ ఫండ్స్పై అవగాహన మాత్రం తక్కువగానే ఉంది. 10% కంటే తక్కువ మంది మహిళలకే వీటి గురించి అవగాహన ఉందని నివేదిక పేర్కొంది. నగదు ఉపసంహరణ సేవలు ఇప్పటికీ మహిళలకు అత్యంత అవసరమైన సేవలలో ఒకటిగా కొనసాగుతున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!