

హైదరాబాద్కు కేంద్రంగా ఉన్న రఘువంశీ ఏరోస్పేస్ గ్రూప్ హార్డ్వేర్ పార్క్లో డీప్టెక్ డిజైన్, తయారీ, ఇంటిగ్రేషన్ కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా దేశీయంగా అభివృద్ధి చేసిన ఆరు మానవరహిత విమానాలు (యూఏవీలు) మరియు అటానమస్ రక్షణ ఉత్పత్తులను ఆవిష్కరించింది.
రఘువంశీ గ్రూప్కు చెందిన ఏరోబోట్ సంస్థ రూ.100 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేసినట్లు వ్యవస్థాపకుడు, ఎండీ వంశీ వికాస్ తెలిపారు. ఇక్కడ కామికేజ్ యూఏవీలు, యూజీవీలు, మైక్రో టర్బో జెట్ ఇంజిన్లు, నిఘా డ్రోన్లు, ఎయిర్ బేస్డ్ మిస్సైల్ లాంచర్లు, డీప్ స్ట్రైక్ వ్యవస్థలు, రోబోటిక్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ సొల్యూషన్లు రూపకల్పన చేయనున్నట్లు చెప్పారు. ఇవి గంటకు 600 కిలోమీటర్ల వేగంతో 300 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలవని వెల్లడించారు.
ఈ ఉత్పత్తుల అభివృద్ధి కోసం భారతీయ సైన్యం, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్), ఏఆర్సీఐ, ఐఐఐటీ హైదరాబాద్తో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రఘువంశీ గ్రూప్ అమెరికా, యూకే, భారత్లలో 10 తయారీ యూనిట్లను నిర్వహిస్తోంది. కంపెనీ ఆర్డర్ బుక్ రూ.1,500 కోట్లు కాగా, వార్షిక టర్నోవర్ రూ.500 కోట్లకు పైగా ఉందని వంశీ తెలిపారు. హార్డ్వేర్ పార్క్లో మరో రూ.300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న రక్షణ ఉత్పత్తుల తయారీ ప్లాంట్ వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి రానుందని ఆయన వెల్లడించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!