

ఆర్బీఐ ఈ ఆర్థిక సంవత్సరంలోని మూడో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా కొనసాగించింది. రెపో రేటులో మార్పు చేయకపోవడం వరుసగా నాలుగోసారి. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన జరిగిన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. వడ్డీ రేట్లపై తటస్థ వైఖరిని కొనసాగించాలని ఎంపీసీ నిర్ణయించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను 6.6 శాతం నుంచి 6.7 శాతానికి పెంచినట్లు ఆర్బీఐ ప్రకటించింది. అలాగే ద్రవ్యోల్బణ అంచనాను 5.1 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. పశ్చిమాసియా సంక్షోభం, ఇంధన ధరల పెరుగుదల ప్రభావాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని ఆర్బీఐ తెలిపింది. దేశీయ వినియోగం, తయారీ, సేవల రంగాల వృద్ధి, ఎగుమతులు ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తున్నాయని పేర్కొంది.
మరోవైపు, 20 ఏళ్ల తర్వాత కొత్త అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులకు లైసెన్సులు జారీ చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. రుణాలపై వడ్డీ రేట్లలో పారదర్శకత పెంచేందుకు కొత్త మార్గదర్శకాలను తీసుకురానుంది. యూపీఐ లావాదేవీల ప్రాసెసింగ్ ఖర్చును ఎవరో ఒకరు భరించాల్సిందేనని, దీనిపై తగిన విధానాన్ని పరిశీలిస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!