

బహుళజాతి కంపెనీలు భారత వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయనే ఆరోపణలు మరోసారి చర్చకు వచ్చాయి. ఉదాహరణగా లండన్లో విక్రయించే ఫాంటా క్యాన్లో తక్కువ చక్కెర, 63 క్యాలరీలు ఉండగా, భారత్లో లభించే అదే పానీయంలో దాదాపు మూడు రెట్లు అధికంగా చక్కెర ఉంటుందని పేర్కొంటున్నారు. యూరప్లో E110 వంటి కృత్రిమ రంగుల వినియోగంపై ప్యాక్ ముందు భాగంలో హెచ్చరికలు తప్పనిసరి కాగా, భారత్లో మాత్రం వివరాలను వెనుక భాగంలో చిన్న అక్షరాలతో పరిమితం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ప్రజారోగ్య నిపుణులు ప్యాక్ల ముందు భాగంలోనే ఎరుపు, ఆకుపచ్చ రంగులతో పోషక నాణ్యతను స్పష్టంగా సూచించే లేబుళ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) హెచ్చరిక లేబుళ్ల ప్రతిపాదనను పక్కన పెట్టడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
రంగుల హెచ్చరికలకు బదులుగా సాధారణ పట్టికలతో సమాచారం అందించాలన్న ఎఫ్ఎస్ఎస్ఏఐ విధానంపై సుప్రీంకోర్టు కూడా ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కథనం పేర్కొంది. ప్రజల ఆరోగ్యంపై దేశానికి శ్రద్ధ ఉందనే విషయం ప్రపంచానికి తెలియాలని కోర్టు వ్యాఖ్యానించింది. అధిక చక్కెర, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను నియంత్రించకపోతే భవిష్యత్తులో ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!