

అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ భారత్లో పెద్ద ఎత్తున ఫ్రెషర్లను నియమించుకోనుంది. ఈ ఏడాదిలో 24,000 నుంచి 25,000 మంది ఫ్రెషర్లను తీసుకోనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇది గత ఏడాది చేసిన 20,000 నియామకాలతో పోలిస్తే దాదాపు 20 శాతం ఎక్కువ. ఫ్రెషర్ల హైరింగ్ను ప్రతి ఏడాది పెంచుతున్నామని, 2024 తో పోలిస్తే గత ఏడాదిలో మరింత పెంచామని, అలాగే ఈ ఏడాదిలో కూడా నియామకాలు ఇంకా పెంచే అవకాశం ఉందని కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ ఎస్ తెలిపారు. ఉద్యోగుల సంఖ్య కూడా పెరిగింది. గత ఏడాది సెప్టెంబరుతో పోలిస్తే డిసెంబర్ నాటికి ఉద్యోగుల నికర సంఖ్య 1,800 పెరిగి 3,51,600 కు చేరింది.
ఆర్థికంగా కూడా కంపెనీ మంచి వృద్ధిని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్తో ముగిసిన క్యూ4లో నికర లాభం 18.7 శాతం పెరిగి 64.8 కోట్ల డాలర్లకు చేరింది. అదే సమయంలో మొత్తం ఆదాయం 4.9 శాతం వృద్ధితో 533.3 కోట్ల డాలర్లకు చేరింది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఆదాయం 7 శాతం పెరిగి 2,110 కోట్ల డాలర్లకు చేరింది. ఇక 2026 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 2,214 నుంచి 2,266 కోట్ల డాలర్ల మధ్య ఉండొచ్చని (4.9–7.4 శాతం వృద్ధి) కాగ్నిజెంట్ అంచనా వేసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!