

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా (ఎంహెచ్ఐ)ను అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్ (KKR) కొనుగోలు చేసింది. సుమారు 120 కోట్ల యూరోలు (దాదాపు రూ.13,200 కోట్లు) విలువైన ఈ ఒప్పందం భారత ఆరోగ్య రంగ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద హాస్పిటల్ కొనుగోలుగా నిలిచింది. ప్రస్తుతం మెడికవర్ ఏబీకి ఉన్న 66.1 శాతం వాటాతో పాటు మైనారిటీ వాటాదారుల వాటాను కూడా కేకేఆర్ కొనుగోలు చేయనుంది.
మెడికవర్ ఏబీకి ఈ ఒప్పందం ద్వారా లభించే నిధులను పోలండ్, రొమేనియా, జర్మనీలోని తమ హాస్పిటల్స్ విస్తరణకు వినియోగించనున్నట్లు సంస్థ వెల్లడించింది. భారత ఆరోగ్య రంగంలో దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని కేకేఆర్ ఈ పెట్టుబడి పెట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఆరోగ్య బీమా వినియోగం పెరగడం, ఆధునిక వైద్య సేవలకు డిమాండ్ అధికమవడం కూడా ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు.
2017లో ప్రారంభమైన మెడికవర్ ఇండియా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో 4,800 పడకలతో 24 హాస్పిటల్స్ను నిర్వహిస్తోంది. దాదాపు 1,900 మంది వైద్యులు 80కిపైగా ప్రత్యేక వైద్య సేవలను అందిస్తున్నారు. అన్ని నియంత్రణ అనుమతులు లభిస్తే ఈ ఏడాది డిసెంబరు నాటికి కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుందని సంస్థ తెలిపింది. అలాగే హాస్పిటల్స్ విస్తరణ ప్రణాళికలు యథావిధిగా కొనసాగనున్నట్లు యాజమాన్యం స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!