

80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ‘ఫ్రీడం 2.0’ ఆఫర్లో భాగంగా కేవలం రూ.1కే సిమ్ అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ సీఎజీఎం ఎం. శేషాచలం తెలిపారు. నెలకు రూ.1,111తో ఫైబర్ సూపర్ ప్లస్ ఓటీటీ ప్లాన్ అందిస్తున్నామని చెప్పారు. ఇందులో 200 Mbps హైస్పీడ్ ఇంటర్నెట్, నెలకు 5,000 జీబీ డేటా, 25 నుంచి 27 ఓటీటీ ప్లాట్ఫారమ్లు, అపరిమిత 24x7 వాయిస్ కాల్స్, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై ఓఎన్టీ రౌటర్ అందుబాటులో ఉంటాయని వివరించారు.
బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ సేవలను కూడా పునఃప్రారంభించినట్లు శేషాచలం వెల్లడించారు. ఈ ఫోన్ దేశంలో ఎక్కడైనా పనిచేస్తుందని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా స్వదేశీ సాంకేతికతతో 4జీ సేవలను అందిస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్కు లక్ష సిగ్నల్ టవర్లు ఉండగా, ఆంధ్రప్రదేశ్లో 6,850 టవర్లు ఉన్నాయని తెలిపారు. టెలికాం సేవలతో పాటు ఇకపై హార్డ్వేర్ సేవలను కూడా విస్తరించనున్నట్లు వెల్లడించారు.
గత ఏడాది దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ రూ.24 వేల కోట్ల ఆదాయం సాధించిందని శేషాచలం తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గత ఏడాది రూ.1,100 కోట్ల ఆదాయం నమోదైందని, ఈ ఏడాది రూ.1,400 కోట్ల లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. 5జీ సేవలకు ప్రస్తుతం ట్రయల్స్ జరుగుతున్నాయని, మరో ఐదు నుంచి ఆరు నెలల్లో సేవలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!