

బిలియనీర్ Gautam Adani నేతృత్వంలోని Adani Group విమానయాన రంగంలో తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. విమాన ఇంజిన్ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ (ఎంఆర్ఓ)తో పాటు ప్యాసింజర్-టు-ఫ్రైటర్ (పీ2ఎఫ్) విమాన మార్పిడి రంగంలోకి ప్రవేశించాలనే యోచనలో ఉన్నట్లు సంస్థకు చెందిన ఉన్నతాధికారి వెల్లడించారు.
పీ2ఎఫ్ మార్పిడి అనేది కాలం తీరిన ప్రయాణికుల విమానాలను కార్గో విమానాలుగా మార్చే ప్రక్రియ. ఎయిర్ కార్గో సేవలకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ఈ రంగం భవిష్యత్తులో కీలకంగా మారనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే విమానాశ్రయాల నిర్వహణ, విమానాల ఎంఆర్ఓ సేవలు, పైలట్ శిక్షణ వంటి విభాగాల్లో అదానీ గ్రూప్ చురుగ్గా ఉంది. ఈ విషయమై Jeet Adani మాట్లాడుతూ, అదానీ గ్రూప్ తన విమానయాన వ్యాపారాన్ని రెండు ప్రధాన విభాగాలుగా విభజించిందన్నారు. ఒకటి విమానాశ్రయ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కాగా, మరొకటి పౌర మరియు రక్షణ రంగాలకు అవసరమైన విమాన సంబంధిత సేవలపై దృష్టి సారించిందని తెలిపారు.
ప్రస్తుతం ల్యాండింగ్ గియర్ మరమ్మతులు, విమాన పెయింటింగ్, కార్గో విమాన మార్పిడులు వంటి సేవలను విస్తరిస్తున్న అదానీ, భవిష్యత్తులో విమాన ఇంజిన్ సేవలను కూడా అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో అహ్మదాబాద్, గౌహతి, భువనేశ్వర్ వంటి నగరాల్లో కొత్త ఎంఆర్ఓ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే ప్రణాళికలో ఉన్నట్లు తెలిపారు.
ఈ నిర్ణయం భారతదేశ విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేయడమే కాకుండా, విదేశీ ఎంఆర్ఓ కేంద్రాలపై ఆధారాన్ని తగ్గించే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!