

ఎలాన్ మస్క్కు చెందిన న్యూరాలింక్ సంస్థ అంధులకు గొప్ప ఆశ చూపిస్తోంది. పుట్టుకతోనే చూపు లేని వారికీ సైతం దృష్టి అందించే దిశగా న్యూరాలింక్ కీలక అడుగులు వేస్తోంది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన ‘బ్లైండ్సైట్’ అనే మెదడు చిప్ ద్వారా అంధత్వ సమస్యకు పరిష్కారం దొరకవచ్చని మస్క్ వెల్లడించారు. ఈ టెక్నాలజీ 2024లో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) నుంచి బ్రేక్త్రూ డివైజ్ హోదా కూడా పొందింది.
న్యూరాలింక్ బ్లైండ్సైట్ చిప్ను మెదడులోని విజువల్ కార్టెక్స్కు అనుసంధానిస్తారు. కళ్ళు లేదా ఆప్టిక్ నాడి పనిచేయకపోయినా, మెదడు ఆరోగ్యంగా ఉంటే ఈ చిప్ ద్వారా దృష్టి అందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. తొలుత చూపు నాణ్యత తక్కువగా ఉండవచ్చని, అయితే క్రమంగా అది మెరుగై సాధారణ కంటిచూపును మించిపోయే స్థాయికి చేరుతుందని ఎలాన్ మస్క్ తెలిపారు.
ఈ బ్లైండ్సైట్ చిప్పై ఇప్పటివరకు జంతువులపై ప్రయోగాలు విజయవంతమయ్యాయి. 2026లో మొదటిసారిగా మనుషులపై పరీక్షలు ప్రారంభించేందుకు న్యూరాలింక్ సిద్ధమవుతోంది. ఈ టెక్నాలజీ విజయవంతమైతే, అంధుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. చూపు లేని వారికి కొత్త ప్రపంచాన్ని చూపించే టెక్నాలజీగా న్యూరాలింక్ నిలవనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!