

టీమ్ ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు బీసీసీఐ నుంచి ఊహించని పరిణామం ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. 2026–27 సీజన్కు సంబంధించి సెంట్రల్ కాంట్రాక్టుల్లో మార్పులు చేయాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ మార్పుల పై ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ప్రధానంగా ప్రస్తుతం అమలులో ఉన్న ‘ఏ ప్లస్’ కేటగిరీని పూర్తిగా తొలగించి, మూడు గ్రేడ్లకే పరిమితం కావాలని కమిటీ సూచించినట్లు బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రతిపాదనకు బీసీసీఐ ఆమోదం లభిస్తే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పై దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఇప్పటికే రోహిత్, కోహ్లీ టెస్టులు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఒకే ఫార్మాట్లో ఆడుతున్న కారణంగా వారిని ఏ ప్లస్ కేటగిరీ నుంచి ‘బీ గ్రేడ్’కు తగ్గించే అవకాశముందని సమాచారం. ప్రస్తుతం ఏ ప్లస్ గ్రేడ్లో ఉన్న ఆటగాళ్లు ఏడాదికి రూ.7 కోట్ల వేతనం పొందుతున్నారు.
అయితే ఏ ప్లస్ గ్రేడ్ రద్దయితే, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలను ‘గ్రేడ్ ఏ’లోకి మార్చే అవకాశముందని చర్చ జరుగుతోంది. ఈ అంశం పై తుది నిర్ణయం త్వరలో జరిగే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకునే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, ఏ ప్లస్ గ్రేడ్ తొలగింపు తర్వాత కొత్తగా ‘డీ గ్రేడ్’ను ప్రవేశపెడతారా అనే అంశంపైనా చర్చ సాగుతోంది. గతంలో ఫాస్ట్ బౌలర్ల కోసం ప్రత్యేక కాంట్రాక్టులను బీసీసీఐ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. నేషనల్ క్రికెట్ అకాడమీ పరిధిలో ఉండే యువ బౌలర్లకు ఈ విధమైన కాంట్రాక్టులు ఇచ్చింది. ఇదే తరహాలో మరో కొత్త విధానం తీసుకొస్తారా అనే దాని పై స్పష్టత రావాల్సి ఉంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!