

భారత్-సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్లో కీలకమైన రెండవ మ్యాచ్ రేపటి నుంచి గౌహతిలో ప్రారంభం కానుంది. మొదటి టెస్ట్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరగగా, ఆ మ్యాచ్లో సౌతాఫ్రికా 30 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ పిచ్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో గౌహతి పిచ్ కూడా స్పిన్నర్లకు మరింతగా అనుకూలం కావచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ రిషభ్ పంత్ ఒక ముఖ్యమైన స్పందన తెలిపారు. గౌహతి పిచ్ పై పూర్తి నమ్మకం ఉందని, ఈసారి మ్యాచ్కు అనుకూలమైన స్వభావం కనపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రెస్ కాన్ఫరెన్స్లో పంత్ మాట్లాడుతూ, “ఈ మైదానం నాకు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకం. నా వన్డే అరంగేట్రం ఇక్కడే జరిగింది. ఇప్పుడు టెస్ట్ కెప్టెన్గా కూడా ఇదే మైదానం నా అరంగేట్ర వేదిక. అంతేకాదు, గౌహతిలో తొలిసారి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. అందుకే ఈ స్థలం నాకు ఎప్పటికీ ప్రత్యేకమే” అని అన్నారు.
పిచ్ పై మాట్లాడుతూ, “ఈసారి పిచ్ బ్యాటింగ్కు చక్కగా సహకరిస్తుందని అనుకుంటున్నాను. మ్యాచ్ మధ్యలో లేదా చివర్లో కొంత టర్న్ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఇది మంచి టెస్ట్ మ్యాచ్ అవుతుందనే నమ్మకం ఉంది” అని పంత్ స్పష్టం చేశారు. మొదటి రోజు నుంచే పిచ్ స్పిన్నర్లకు అధిక పట్టు ఇవ్వకుండా, బ్యాట్స్మన్లకు కూడా అవకాశాలు ఉండేలా ఉంటుంది అన్న సంకేతాలు ఇచ్చారు.
కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చినందుకు బీసీసీఐకి ఆయన మరోసారి ధన్యవాదాలు తెలిపారు. “కొన్నిసార్లు మ్యాచ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తే ప్రయోజనం ఉండదు. మొదటి టెస్ట్ మనం బాగా ఆడలేదు. కానీ ఈ మ్యాచ్లో గెలవడానికి అవసరమైన ప్రతిదీ చేస్తాం. సిరీస్ను సమం చేయడమే మా లక్ష్యం” అని పంత్ తెలిపారు.
టీమిండియా ఈ మ్యాచ్ను గెలిచి సిరీస్ను సమం చేయాలని పట్టు పట్టింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!