

పురుషుల జూనియర్ ఆసియాకప్ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో మలేసియాను 3-1తో ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. కెప్టెన్ అన్మోల్ ఎక్కా మరోసారి అద్భుత ప్రదర్శనతో రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆరంభం నుంచే భారత్ దూకుడుగా ఆడగా, 12వ నిమిషంలో గోల్ అవకాశం తృటిలో చేజారింది. 16వ నిమిషంలో అన్మోల్ పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచి భారత్కు ఆధిక్యాన్ని అందించాడు. అనంతరం మలేసియాకు లభించిన పెనాల్టీ కార్నర్ను భారత గోల్కీపర్ వివేక్ లాక్రా అద్భుతమైన డైవ్తో అడ్డుకున్నాడు. మూడో క్వార్టర్లో ప్రభ్దీప్ సింగ్ ఎల్లో కార్డుతో బయటకు వెళ్లడంతో భారత్ 10 మందితో ఆడినా, మలేసియా దాడులను సమర్థంగా నిలువరించింది.
ఆఖరి క్వార్టర్లో సుఖ్వీందర్ సింగ్ 51వ నిమిషంలో గోల్ చేసి భారత్ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. రెండు నిమిషాల తర్వాత మలేసియాకు పెనాల్టీ స్ట్రోక్ లభించినప్పటికీ, వివేక్ లాక్రా మరోసారి అడ్డుకుని భారత్ ఆధిక్యాన్ని కాపాడాడు. 54వ నిమిషంలో అన్మోల్ మరో పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచి భారత్ను 3-0 ఆధిక్యంలో నిలిపాడు. మ్యాచ్ ముగియడానికి 24 సెకన్ల ముందు మలేసియా తరఫున రాహుల్ గోల్ చేసినా, భారత్ 3-1తో విజయం సాధించి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. కొరియా-పాకిస్థాన్ మధ్య జరిగే మరో సెమీఫైనల్ విజేతతో భారత్ ఫైనల్లో తలపడనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!