

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో టీ20 ఫార్మాట్ హవా కొనసాగుతోంది. అయితే ఐసీసీ టోర్నీల్లో వన్డే క్రికెట్కు మాత్రం అభిమానుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇటీవల జరిగిన వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీలకు లభించిన స్పందనే ఇందుకు నిదర్శనం. అయితే ద్వైపాక్షిక వన్డే సిరీస్లు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోందని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ అన్నారు. వన్డే క్రికెట్ ఇంకా సజీవంగా ఉందంటే అందుకు ప్రధాన కారణం అభిమానులేనని, వారి ఆదరణ లేకపోతే ఈ ఫార్మాట్ ఇప్పటికే కనుమరుగయ్యేదని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో వన్డేలకు మరిన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.
టీ20 క్రికెట్ వచ్చిన సమయంలో దాని ప్రభావం టెస్టులపై తీవ్రంగా పడుతుందని చాలామంది భావించారని రోడ్స్ గుర్తుచేశారు. అయితే టెస్టులకు ఆదరణ తగ్గకపోగా.. కొన్ని మ్యాచ్లు దూకుడైన బ్యాటింగ్, బౌలింగ్తో టీ20 తరహా వినోదాన్ని అందిస్తున్నాయని చెప్పారు. అదే సమయంలో అంతర్జాతీయ క్యాలెండర్లో టీ20 లీగ్లకు పెరుగుతున్న ప్రాధాన్యం, ద్వైపాక్షిక వన్డే సిరీస్లు తగ్గిపోవడం 50 ఓవర్ల ఫార్మాట్కు ప్రతికూలంగా మారుతున్నాయని పేర్కొన్నారు. టీ20లకు ప్రాధాన్యం ఇవ్వడం అవసరమే అయినా, వన్డేలను నిర్లక్ష్యం చేయకూడదని రోడ్స్ సూచించారు. అంతర్జాతీయ క్రికెట్లో వన్డేలు లేని పరిస్థితిని ఊహించడం కష్టమని స్పష్టం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!